09-06-2025 04:24:22 PM
న్యాయవాదిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్
ఇద్దరిని అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులు
ఎల్బీనగర్: హైకోర్టు సీనియర్ న్యాయవాదిని కిడ్నాప్ చేసి , కోటి రూపాయలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లను పోలీసులు కటకటాల్లోకి పంపించారు. న్యాయవాది కిడ్నాప్ కేసును వనస్థలిపురం పోలీసులు సకాలంలో స్పందించి, ఇద్దరు కిడ్నాపర్లను రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు... వనస్థలిపురం డివిజన్ సరస్వతినగర్ లోని ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ లో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణ(52) కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీన నారాయణ కోర్టుకు వెళ్లి, తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన భార్య సువర్ణమ్మ 8వ తేదీన వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెల్లవారుజామున వెంకటేశ్ అనే వ్యక్తి ఫోన్ చేసి నీ భర్తను కిడ్నాప్ చేశామని, మాకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే నీ భర్తను చంపేస్తామని బెదిరించారని పోలీసులకు భార్య సువర్ణమ్మ వివరించారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ లో బెదిరించిన వెంకటేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కిడ్నాప్కు మేడ్చల్, కుత్బుల్లాపూర్లోని ఒక భూవివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 2020లో మేడ్చల్, కుత్బుల్లాపూర్లోని ఒక భూమి విషయంలో నారాయణ మధ్యవర్తిగా వ్యవహరించి కోటి రూపాయలు తీసుకుని అగ్రిమెంట్ చేయించినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు.
అయితే, భూమి అగ్రిమెంట్కు సంబంధించిన విషయంపై మాట్లాడకుండా నారాయణ నాన్చుతున్నాడని, దీంతో ఆదివారం ఇద్దరు వ్యక్తులు నారాయణను తీసుకెళ్లినట్లు గుర్తించారు. నారాయణ మధ్యవర్తిగా ఉండి డబ్బులు తీసుకున్న తర్వాత కూడా స్పందించకపోవడంతోనే కిడ్నాప్ జరిగిందని తెలుస్తోంది. కిడ్నాప్ కి కారణమైన వెంకటేశ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా, నారాయణ తనకు రూ, 35 లక్షలు ఇవ్వాలని, ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోవడంతో కిడ్నాప్ చేశానని ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు.