3 March, 2026 | 8:14 AM

సహజసిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలి

03-03-2026 12:00 AM

ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 2, (విజయక్రాంతి): హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుభాకాంక్షలు తెలిపుతూ హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌరవంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు. హోళీ వేడుకల సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, హానికరమైన రసాయనిక రంగులను వాడకూడదని సూచించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు.

ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై వాహనదారులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు. ఎవరైనా ఆకతాయిలు  వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం షీ టీమ్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రధాన కూడళ్లలో  జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు.

పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవంతో సురక్షితంగా హోళీ పండుగను జరుపుకొని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.