calender_icon.png 6 December, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుశాఖలో హోంగార్డు ఆఫీసర్స్ పనితీరు ప్రశంసనీయం: ఎస్పీ రోహిత్ రాజు

06-12-2025 08:12:55 PM

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలు

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పోలీసు శాఖలో హోంగార్డు ఆఫీసర్స్ పనితీరు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎస్పీ  శాంతి కపోతాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖలో భాగంగా పనిచేస్తున్న హోంగార్డ్స్ ఆఫీసర్స్ నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

సుందరంగా అలంకరించిన వాహనంలో పరేడ్ నందు పాల్గొన్న 06 హోమ్ గార్డ్స్ ప్లాటూన్స్ ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై, పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమన్నారు. వరదలు సంభవించినపుడు,ఎన్నికల సమయంలో, రోజువారీ విధులలో  హోంగార్డ్ ఆఫీసర్స్ అంకితభావంతో సేవలందిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతాయుతమైన సేవలు అందించడంతో పాటు పొరుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల బందోబస్తులో అప్పగించిన భాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నారని వారి సేవలను కొనియాడారు.

నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని వారికి సూచించారు. హోంగార్డ్స్ ఆఫీసర్స్ సంక్షేమానికి అన్ని వేళలా ముందుంటామని తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు.త్వరలో పదవీ విరమణ పొందుతున్న 02 మంది హోంగార్డ్స్ ఆఫీసర్లకు, హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడల్లో బహుమతులు సాధించిన వారికి ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు.

అదేవిధంగా విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. హోమ్గార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వారితో కలిసి ఎస్పీ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఆర్ఐ నరసింహారావు,ఇతర అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు అల్పాహార విందులో పాల్గొన్నారు.