calender_icon.png 24 June, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

23-06-2025 11:08:41 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదలకు గూడు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. సోమవారం జిల్లాలోని చరమేరి మండలం కొటారి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

ఇండ్ల నిర్మాణ పనులలో వినియోగించే సిమెంటు ఇటుకలను, ఇసుక నాణ్యత పరిశీలించి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఇండ్ల నిర్మాణ పనుల బిల్లులను ప్రతి సోమవారం లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని, బేస్ మెంట్, రూఫ్ లెవెల్, స్లాబుకు సిద్ధముగా ఉన్న ఇండ్ల వివరాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు ఫోటోలతో సహా ఆన్ లైన్ పోర్టల్ లో వెంటనే నమోదు చేయాలని తెలిపారు. లబ్ధిదారుల ఖాతాలలో సకాలంలో నిధులు జమ అయ్యేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మండలంలోని సాగర్ ఖేడా గ్రామంలోని ప్రధానమంత్రి శ్రీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను పరిశీలించారు.

పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, వంటకు వినియోగించే కూరగాయల నాణ్యత, వంటశాలలను పరిశీలించి మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం మెనూ వివరాలను తెలుసుకొని వంట తయారుచేసే సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని సూచించారు. తరగతి గదులు, వంటశాల, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, పాఠశాలలో 100 శాతం విద్యార్థుల హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా గృహ నిర్మాణ అధికారి వేణుగోపాల్ రెడ్డి, తహసిల్దార్ భూమేశ్వర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజద్ పాషా, జిల్లా విద్యాశాఖ అధికారి ఉదయ్ బాబు, మండల విద్యాధికారి ఆడే ప్రకాష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడార్ల రంగయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.