గంజాయి మత్తు వీడేదెలా?
- రాష్ట్రంలో భారీగా పట్టుబడుతున్న గంజాయి
- యువత, విద్యార్థులే టార్గెట్
- 6 నెలల్లోనే 26.80 క్వింటాళ్లు స్వాధీనం
- ఒడిశా, ఏపీ రాష్ట్రాల నుంచి దిగుమతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ ౨౦ (విజయక్రాంతి): రాష్ట్రంలో గంజాయి విక్రయా లు ఆందోళన కలిగిస్తున్నాయి. యువత, విద్యార్థులే లక్ష్యంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఒకవైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిస్తుంటే.. వరుసగా పట్టుబడుతున్న గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. డ్రగ్స్తో పోల్చితే తక్కువ ధరకే లభిస్తుండడంతో గంజాయి ప్రియులు మత్తులో మునిగి తేలుతున్నారు. దీంతో గంజాయి మత్తు వీడేదెలా అని సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో భారీగా గంజా యి పట్టుబడుతున్నప్పటికీ.. సరఫరా చేసేవారు ఏ మాత్రం బెదరకుండా అక్రమ రవా ణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 2023 సంవత్సరంలో అధికారులు మొత్తం 63.55 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు. డ్రగ్స్, గంజాయి రవాణాకు సంబంధించిన 874 కేసుల్లో 1,218 మందిని అరెస్టు చేశారు. కాగా, 2024 జనవరి నుంచి జూన్ వరకే 498 కేసులు నమోదు చేసి 26.80 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. 718 మందిని అరెస్టు చేశారు. ఇవి కేవలం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న వి మాత్రమే. రైల్వే, సివిల్ పోలీసులు పట్టుకున్న గంజాయి వివరాలతో కలిపితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఒడిశా, ఏపీ టు తెలంగాణ..
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని కొన్ని మారుమూల ప్రాంతా ల్లో గంజాయి సాగు చేస్త్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఎప్పటికప్పుడు గంజాయి మొక్కలను ధ్వం సం చేస్తున్నప్పటికీ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుం చి తెలంగాణ మీదుగా హైదరాబాద్, ముంబై ప్రాంతాలకు అక్రమార్కులు గంజాయిని వివిధ మార్గాలు, రూపాల్లో తరలిస్తున్నారని తెలుస్తోంది. అందుకోసం ప్రైవేటు వాహనాలను ఉపయోగిస్తున్నారు. గంజాయి ప్యాకెట్ల ను వాహనాల డోర్లలో, సీట్ల కింద అమర్చి పోలీసులకు చిక్కకుండా సరఫరా చేస్తున్నారు. అయితే, పోలీసుల తనిఖీ ల్లో అనేక వాహనాలు పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం వివిధ సంఘటనల్లో 313 వాహనాలను సీజ్ చేశారు. ఈ ఏడాది జూన్ నాటికే 189 సీజ్ చేశారు. దీం తో గంజాయి సరఫరాకు రైళ్లను వాడుకుం టూ రిస్క్ తగ్గించుకుంటున్నారు. బోగీలలో ఎక్కడో ఓ చోట కూర్చొని మరో చోట గంజాయి బ్యాగులను ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. దొరికితే సరుకు పోతుంది.. లేదంటే గంజాయిని తరలించి సొమ్ము చేసుకోవచ్చనే దిశగా ఆలోచిస్తున్నారు.
పోలీసులకు చిక్కకుండా..
గంజాయిని తరలిస్తున్న సందర్భంలో ఆ వాసనను పోలీసులు సులభంగా పసిగట్టవచ్చు. దానివల్ల పోలీసులకు చిక్కే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీంతో పోలీసులకు చిక్కకుండా గంజాయి సరఫరా చేసేవారు శతకోటి ఉపాయాలు, ఎత్తులు వేస్తున్నారు. గంజాయిని కవర్లలో చుట్టి తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అలా తరలిస్తున్న క్రమం లో ఇబ్బంది కలుగుతుండడంతో చాక్లెట్ల మాదిరిగా తయారు చేసి యథేచ్ఛగా తరలిస్తున్నారు. గంజాయి విక్రేతల నుంచి కొను గోలు చేసినవారు గంజాయిని సిగరెట్లు, చాక్లెట్ల, 1 గ్రాముల ప్యాకెట్ల రూపంలోకి మార్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. 30 గ్రాముల గంజాయిని సుమారు రూ.3 వేల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
వలస కార్మికుల ద్వారా..
నగరంలో ప్రధానంగా దూల్పేట్, శం షాబాద్, ఎల్బీ నగర్తో పాటు పలు పారిశ్రామిక వాడలు, బస్తీల్లో ఎక్కువ గంజా యి వినియోగదారులున్నట్లు ఎక్సైజ్ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ఎక్కువ మంది ఉత్త రాదికి చెందిన వలస కార్మికులు ఉండడమే గంజాయి వినియోగానికి కారణమని తెలుస్తోంది. వారి ద్వారా కూడా పలు మార్గాల్లో గంజాయి సరఫరా అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వారితో పాటు ఇక్కడి యువత కూడా గంజాయికి అలవాటు పడి మత్తులో తూగుతున్నట్లు అధి కారులు భావిస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ తదిత ర ప్రాంతాల నుంచి ఎక్కువ గంజాయి నగరానికి సరఫరా అవుతోందని వివిధ సం దర్భాల్లో ఆయా ప్రాంతాల్లో గంజాయి లభ్యమవడాన్ని బట్టి అంచనా వేస్తున్నారు.






