సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలిపేలా భారీ బైక్ ర్యాలీ
ఎమ్మెల్యే కృషి వల్లే రూ.824 కోట్లు మంజూరు..
డీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సిరాజ్ ఖాద్రీ
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కృషి వల్లే మహబూబ్ నగరంలో అందర్ డ్రెయినేజీకి రూ.603 కోట్లు, తాగునీటి పైపులైన్ వ్యవస్థ కోసం రూ.221 కోట్లు మంజూరైనట్లు డీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సిరాజ్ ఖాద్రీ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ ఇంతస్థాయిలో పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరుకాలేదన్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు.
ఇంతభారీ స్థాయిలో నిధులు మంజూరైనందుకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞత తెలిపేలా పట్టణంలో భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల నుంచి కాంగ్రెస్, అనుబంధసంఘాల నాయకులు, కార్యకర్తలు ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోవాలని, అక్కడి నుంచి మోటార్ బైక్ లతో అంబేద్కర్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, న్యూటౌన్, మెట్టుగడ్డ మీదుగా శ్రీనివాసకాలనీ వరకు అక్కడి తిరిగి క్లాక్ టవర్ వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం కృతజ్ఞతసభ నిర్వహిస్తామని అన్నారు. ఈ బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, జిల్లా మత్స్యసహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్ గోనెల శ్రీనివాసులు, ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్, కాంగ్రెస్ మైనార్టీ విభాగం అసెంబ్లీ అధ్యక్షులు ఫకృద్దీన్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.






