23-06-2025 12:59:24 AM
గద్వాల, జూన్ 22 (విజయక్రాంతి): ప్రియురాలిని పెళ్లి చేసుకున్న యువకుడు.. నెల రోజుల్లో నే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన గద్వాలలో జరిగింది. గంట వీధికి చెందిన గంట జయరాములుకు తేజవర్దన్, తేజేశ్వర్ ఇద్దరు కవలలు. చిన్నవాడైన తేజేశ్వర్(32) లైసెన్స్ సర్వేయర్గా పని చేస్తున్నాడు. కర్నూల్కు చెందిన ఐశ్వర్య అనే యువతిని ప్రేమించగా.. మొదట ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి.
నిశ్చితార్థం అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దయింది. కొన్నిరోజుల తర్వాత తేజేశ్వర్, ఐశ్వర్య ఇద్దరు మళ్లీ దగ్గరయ్యారు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు వద్దని వారించినా వినకుండా మే 18న బీచుపల్లిలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. గద్వాలో కాపురం పెట్టారు. ఈ నెల 17న తేజేశ్వర్ సర్వే పనుల మీద బయటకు వెళ్లి తిరిగి రాలేదు. జూన్ 21న పాణ్యం వద్ద హత్యకు గురై విగతజీవిగా కనిపించాడు.
ఐదు రోజులైనా తేజేశ్వర్ రాకపోవడంతో అతని అన్న తేజవర్థన్ గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గద్వాల ఎస్పీ ప్రత్యేక బృందంతో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. శనివారం రాత్రి గద్వాల పోలీసులు కర్నూలుకు వచ్చి కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్య సహకారంతో విచారించారు. ఈ క్రమంలో పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు దగ్గరలో తేజేశ్వర్ మృతదేహాన్ని పోలీసులు మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా గుర్తించారు.
పాణ్యం పోలీసుల సహాయంతో ఆ మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఐశ్వర్య తల్లి కర్నూల్లోని ఓ బ్యాంక్లో అటెండర్గా పని చేస్తోంది. అదే బ్యాంకులో పనిచేసే ఉన్నతస్థాయి ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. అయితే ఐశ్వర్య తల్లికి, ఆమె ప్రియుడికి ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా తెలిసింది. ఐశ్వర్య కూడా కొంతకాలంగా బ్యాంక్ మేనేజర్తో సన్నిహితంగా ఉంటూనే తేజేశ్వర్ను అయిష్టంగానే పెళ్లి చేసుకుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగి, అత్త కలిసి తేజేశ్వర్ను హతమార్చాలని కుట్రపన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ సర్వేయర్ అయిన తేజేశ్వర్ను కర్నూలులో అతడికి పరిచయం ఉన్నవారితో ఫోన్ చేయించి, ల్యాండ్ సర్వే పేరు చెప్పి రమ్మన్నారని తెలిసింది. నమ్మి వచ్చిన తేజేశ్వర్ను కడతేర్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ టంగుటూరి శ్రీనివాస్ వెల్లడించారు.