31-05-2025 10:00:40 PM
దళిత బంధు నిధులు అడ్డుకున్నది కౌశిక్ రెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ అభివృద్ధి నాతోనే సాధ్యమవుతుందని, పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గ ప్రగతికి పెద్దపీట వేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని స్థానిక హై స్కూల్ క్రీడా మైదానంలో శనివారంపది లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్ కి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంవత్సరాల కొద్ది పెండింగ్లో ఉన్న పనులను చేస్తుందని, ముఖ్యమంత్రి, జిల్లా మంత్రుల సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి హుజురాబాద్ అభివృద్ధి కొనసాగిస్తామని అన్నారు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు.
దళిత బంధు నిధులు అడ్డుకున్నది కౌశిక్ రెడ్డి
దళిత బంధు నిధులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని ప్రణవ్ అన్నారు. చంపినోడే సంతాపం తెలిపినట్లు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఉందని, ఆయన తలుచుకుంటే రెండవ దశ దళిత బంధు నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం తప్ప హుజురాబాద్ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదన్నారు. దళితులపై కపట ప్రేమ వలకబోసున్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి దళితుల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. దళితుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.