18-09-2025 12:00:00 AM
ప్రజా పాలన దినోత్సవంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజ యలక్ష్మి అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిం చిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఉద్యోగులు, అధికారులను ఉద్దేశించి సందేశాన్ని వినిపించారు. అనేకమంది అమరుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ గడ్డ నిరంకుశ, రాజరిక పాలన నుంచి విముక్తి పొంది, ప్రజాస్వామ్య పాలనకు పునాదులు పడ్డాయన్నారు.
ఆ త్యాగాలను గౌరవిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాలనే లక్ష్యంతోనే నేటి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఆర్వి కర్ణన్, అదనపు కమిషనర్లు కే వేణుగోపాల్, గీతా రాధిక, సీసీపీ శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్లు సహదేవ్ రత్నాకర్, నిత్యానంద్, విజిలెన్స్ ఏఎస్పీ సుదర్శన్, డీఎస్పీ నరసింహారెడ్డి, పీఆర్ఓ మామిండ్ల దశరథం పాల్గొన్నారు.