11-09-2024 01:41:42 AM
డొమెస్టిక్ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రం
2024లో తొలి అర్థభాగంలో ఢిల్లీకి తొలిస్థానం
టాప్ హైదరాబాద్కు చోటు
ఎంజాయ్ చేస్తున్న పురుషులు
నెలవారీ నివేదికలో కేంద్రం వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం తీవ్రమైన కసరత్తులు చేస్తోంది. టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చే యోచన చేస్తోంది. ఇదే సమయంలో కేంద్రం 2024లో జనవరి -జూన్ వరకు గల దేశీయ టూరిజం గణాంకాలను వెల్లడించింది. అయితే ఇందులో ఆకక్తికర విషయాలను చెప్పింది.
దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్-5 నగరాల జాబితాను కేంద్రం ప్రకటించగా.. అందులో హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో ఢిల్లీ ఉండగా.. రెండో స్థానంలో ముంబై, మూడో స్థానంలో కొచ్చిన్, నాలుగో స్థానంలో చెన్నై ఉన్నాయి. ఆరు నెలల్లో ఐదోస్థానంలో నిలిచిన హైదరాబాద్కు.. జూన్ నెలకు సంబంధించిన జాబితాలో టాప్-5లో చోటు దక్కలేదు.
పురుషులే అధికం..
2024లో జనవరి-జూన్ మధ్య డొమెస్టిక్ పర్యాటకులు 1.5 కోట్ల మంది పర్యటించారు. ఇందులో హైదరాబాద్ వాటా 6.95 శాతం కావడం కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి దేశీయ పర్యాటకుల సంఖ్య 1.32 కోట్ల మంది ఉన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దేశీయ పర్యాటకుల సంఖ్య 12.72శాతం వృద్ధి చెందినట్లు కేంద్రం చెప్పింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది తొలి అర్థభాగంలో దేశంలో పర్యటించిన పర్యాటకుల్లో 66.5 శాతం పురుషులు కాగా.. 35.5 శాతం మంది మహిళలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
విదేశీ టూరిస్టుల్లోను ఆకర్షించడంలో వెనుకంజ..
డొమెస్టిక్ పర్యాటకులను ఆకర్షించడంలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన తెలంగాణ.. విదేశీ టూరిస్టుల విషయంలో కాస్త వెనుకబడ్డదని కేంద్రం నివేదిక చెప్పింది. అందుకే టాప్ జాబితాలో హైదరాబాద్కు చోటు దక్కలేదు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై నగరాలు ఉన్నాయి. దేశానికి వస్తున్న విదేశీ టూరిస్టుల్లో 58.66 శాతం మంది పురుషులు, 41.33శాతం మంది మహిళలు, 0.01 మంది ఇతురులు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. విదేశీ పర్యాటకుల ద్వారా దేశానికి ఆరు నెల్లల్లో రూ.19,266కోట్ల విదేశీ నిల్వలు వచ్చినట్లు చెప్పింది.
