27-07-2025 11:34:15 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): హిందీ ప్రచార సభ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్. గైబువల్లి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah), కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి(Minister Nitin Gadkari), విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, హెూం మంత్రిత్వ శాఖలోని కేంద్ర అధికార భాష అధికారులను, సెంట్రల్ హిందీ డైరేక్టరేట్(న్యూఢిల్లీ) అధికారులను కలిసి వారికి హిందీ ప్రచార సభ కార్యక్రమాలను వివరించినట్లు సభ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ ఆదివారం తెలిపారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్ ద్వార వెలువడే వివరణ పత్రికకు ఈ ఆగస్టు నాటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తోందని తెలిపారు. దీనికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడులు హిందీ భాషేతర ప్రాంతాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ గత 90 సంవత్సరాలుగా హిందీ భాషకు చేస్తున్న కృషికి అభినందిస్తూ హిందీ ప్రచారసభ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపినట్లు వివరించారు.
ఈ సందర్భంగా హిందీ ప్రచార సభ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రులు, కేంద్ర అధికార భాష శాఖ అధికారులు, సెంట్రల్ హిందీ డైరక్టరేట్ (ఢిల్లీ) అధికారులు, హిందీ ప్రచార సభ ప్రతినిధుల బృందానికి తెలిపారు. ఈ సందర్భంగా హిందీ సేవా సదన్ మహా విద్యాలయం ద్వారా సి.బి.ఎస్.ఇ. బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడే పాఠశాలలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు హిందీలో పోటీ పరీక్షలకు సంబంధించిన బ్రోచర్ ను కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో హిందీ ప్రచార సభ న్యాయ సలహాదారులు జె. వెంకటరామనరసింహా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ అధ్యక్షుడు సి.ఎల్. నాయుడు, సభ్యులు రమాదేవి, రవిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.