అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్... హైకోర్టు లాయర్ ఫామ్హౌస్ కూల్చివేత
హైదరాబాద్: సంగరెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం(Ameenpur Mandal) ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఐలాపూర్ లో ఆక్రమణలను తొలగించింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు చేపట్టింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన హైకోర్టు లాయర్ ముఖీమ్ గెస్ట్ హౌస్ ను హైడ్రా(HYDRAA demolitions) అధికారులు నెలమట్టం చేశారు.
ముఖీమ్ సోదరుడు అజీమ్ నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ఖాళీ స్థలాలను హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐలాపురంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమిలో పేదల నివాసాల జోలికి వెళ్లకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 86 ఎకరాల భూమి విలువ రూ. 15 వేల కోట్లకు పైగా ఉటుందని అంచనా వేస్తున్నారు. ఘర్షణ వాతావరణం తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. ప్రభుత్వ, ఇనాం భూముల్లో అనధికారికంగా భవనం నిర్మించారు. ప్రజావాణిలో ఫిర్యాదుతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు భవనాన్ని కూల్చివేశారు.




