టీడీపీ సీనియర్ నేత కాకర్ల సుందరయ్య కన్నుమూత
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో చెక్కుచెదరని ఉక్కుమనిషి.
దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించిన సుందరయ్య ఇకలేరు.
చర్ల,(విజయక్రాంతి): చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన కాకర్ల సుందరయ్య శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పార్టీ కోసం పుట్టిన మనిషి అన్న పేరు తెచ్చుకున్న సుందరయ్య గ్రామస్థులకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరుగాంచారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా టీడీపీ జెండా పట్టుకుని ముందుకు సాగిన ఉక్కుమనిషి ఆయన. సుందరయ్య మరణవార్త తెలియగానే ప్రతిపక్ష నేతలు సైతం కదిలిపోయారు.
నివాళులర్పించిన వారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీనివాసరావు, లింగాపురం సర్పంచి గుగులోతు మంగ, పార్టీ సీనియర్ నాయకులు జవ్వాది రవిచంద్ర కుమార్, బండారు రామకృష్ణ, విజయ భాస్కర్ రెడ్డి, నేదురి సత్యనారాయణ, పటేల్ వెంకటేశ్వర్లు, కాకర్ల కుమార్, ఉస్మాన్, ఉప సర్పంచ్ తడికల నరేష్ ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... "పార్టీలు వేరైనా సుందరయ్య గారి మానవత్వం, సేవాగుణం అందరికీ ఆదర్శం. దశాబ్దాలుగా టీడీపీలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన మరణం లింగాపురానికి, టీడీపీకి తీరని లోటు" అని అన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు.






