calender_icon.png 27 July, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటించడంతోనే పనైపోదని తెలుసుకున్నా

24-07-2025 12:00:00 AM

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దక్షిణాది అందం రెజీనా కసాండ్ర. నటిగా 2005లో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ అమ్మడు 2010లో విడుదలైన ‘ఎస్.ఎమ్.ఎస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటీవల స్టార్ హీరో అజిత్‌కుమార్ హీరోగా నటించిన ‘పట్టుదల’లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపర్చింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘మూకుత్తి అమ్మన్2’లో నటిస్తోంది. సుందర్ సీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇదిలా ఉండగా.. రెజీనా పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడింది. “నాకు 2015-16లో పనిచేయాలనిపించలేదు. యాక్టింగ్ మానేయాలనుకున్నాను.

అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి చేశాను. కానీ, 2018 నుంచి అవకాశాలు వరుస కట్టాయి. అయితే, ఒకే తరహా పాత్రల్లో నటించకూడదన్న నిబంధన పెట్టుకున్నాను. టాలీవుడ్‌లోకి వెళ్లిన తొలినాళ్లలో ఉదయం 6 గంటలకే నాకు డైలాగులు తెచ్చిచ్చేవారు. అప్పుడు నాకు తెలుగు రాదు. దీంతో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అన్ని డైలాగులూ కంఠస్థం చేసేదాన్ని. భావోద్వేగాలను అర్థం చేసుకునేదాన్ని.

లైన్ టు లైన్ నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ కారణంగానే ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలను. నాకు సినీ నేపథ్యం లేదు. ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు నటించి, ఇంటికి వచ్చేయడమే అనుకునేదాన్ని. కానీ, దాంతోపాటు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉంటాయనేది కాలం గడిచేకొద్దీ బోధపడింది. పీఆర్‌లు, సోషల్‌మీడియా ప్రాధాన్యం గురించి అర్థమైంది. నేను వీటికి చాలా రోజులు దూరంగా ఉన్నాను.

నా నటనను చూసి అవకాశం ఇవ్వాలి కానీ, పబ్లిసిటీ చూసి కాదని అనుకోవడం వల్లే అలా చేశాను. కానీ, అది తప్పు అని తెలుసుకున్నాను. ఇప్పుడు సోషల్‌మీడియా ద్వారానే నా పనిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాను. 20 ఏళ్ల కెరీర్‌ను మైలురాయిగా ఎందుకు చూస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ, నేను కొన్ని విషయాల్లో అగ్రస్థానంలో లేను. కొన్నేళ్లుగా వరుసగా తెరపై కనిపించనప్పటికీ 20 ఏళ్లంటే చాలా పెద్ద విషయం” అని చెప్పింది.