25-06-2025 10:28:39 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడితే బంగారు భవిష్యత్తో పాటు దేశ భవిష్యత్ నాశనమవుతుందని మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కొత్తగూడ, గంగారం ఎస్ఐ లు కుశ కుమార్, రవి కుమార్ అన్నారు. కొత్తగూడ మండల కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్, ఏకలవ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ పోస్టర్లను సంబంధిత అధ్యాపక బృందంతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ లు మాట్లాడుతూ... సరదా కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటే నష్టం తప్పదని, ఇలాంటి సరదాలు వద్దని సూచించారు. మాదకద్రవ్యాలు సేవించినా, కలిగి ఉన్నా చట్ట ప్రకారం నేరం అని, క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కష్టపడి చదివిన వారు ఉన్నత శిఖరాలు అధిరోహించి వారి జీవిత కాలం సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతారన్నారు. చెడు వ్యసనాలకు బానిసలై చదవకుండా సంతోషంగా ఉన్నామని ఊహించుకుంటే జీవితమంతా కష్టాలు, శ్రమతో గడపాల్సి ఉంటుందన్నారు.