వేధిస్తే షీ టీమ్స్ను ఆశ్రయించండి
- మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి
మంచిర్యాల, (విజయక్రాంతి) : మహిళలను, బాలికలను పని స్థలాల్లో, ప్రయాణాల్లో వేదిస్తే షీ టీమ్ ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి కోరారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు షీ టీమ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఉపాధి హామీ కూలీలకు సోమ వారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, టీ-సేఫ్ యాప్, షీ టీమ్స్ సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో వివరించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్ విధులు, సేవల గురించి ఉపాధి హామీ కూలీలకు వివరించారు. ఇబ్బందులు పడుతున్నప్పుడు, అత్యవసర సమయంలో హెల్ప్లైన్ నంబర్లు డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385 లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నయ్య, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.






