14-06-2025 12:38:55 AM
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి): రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ అవాకులు చవాకులు పేలుస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని దీనికి ప్రధాన సూత్రధారులు కెసిఆర్ హరీష్ రావు లేనని అయన స్పష్టం చేశారు.
జ్యూడిషల్ విచారణ ఎదుర్కొంటున్న కెసిఆర్, హరీష్ రావులకు శిక్ష తప్పదని అన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని రేవంత్ రెడ్డికి వస్తున్న పేరుని చూసి ఓర్వలేక నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. గత పదేళ్ళ కాలంలో పాల్గొన్న అవినీతి అక్రమాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఎన్నికల్లో ఒడించారని ఆయన అన్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదా నిర్వర్తించకుండా రేవంత్ రెడ్డి సర్కారుపై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారని నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మరోసారి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని ఎక్కడికక్కడ నిలదీసి తరిమి తరిమి కొడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు దక్కనివ్వమని హెచ్చరించారు.
పదేళ్ల కాలం పాటు తెలంగాణను దోచుకున్న వీరికి అధికారం కోల్పోవడంతో మానసిక ఒత్తిడికి లోనై ఇష్ట రాజ్యాంగ మాట్లాడుతున్నారని ఆరోపించారు. వీరి మానసిక స్థితి బాగాలేక కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో దోపిడి కమిషన్ విచారణలో బయట పడుతుంందని మామా అల్లుళ్లు పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యాయం జరిగిందని అధిష్టానికి ఈ విషయం విన్నవించామన్నారు.
మంత్రివర్గంలో మరో మూడు ఖాళీలు ఉన్నాయని త్వరలో జరిగే విస్తరణలో జిల్లాకు మంత్రి పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, యూత్ కాంగ్రెస్ నాయకులు వేణు రాజ్, రూరల్ యువజన అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్, సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.