calender_icon.png 6 June, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను సస్పెండ్ చేస్తే మీ జాతకాలు బయటపెడ్తా

03-06-2025 12:00:00 AM

  1. బీజేపీ నేతలకు ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు

సొంత పార్టీ నేతలపై తిరుగుబాటు జెండా 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): సొంత పార్టీ నేతలపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా పార్టీ నేతలపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపుతూ సస్పెండ్ చేసేందుకు అధిష్ఠాన సిద్ధమవుతుందన్న సమాచారం ఉన్న నేపథ్యంలో తనను సస్పెండ్ చేస్తే పార్టీలోని కీలక వ్యక్తుల జాతకాలన్నీ బయటపెడతానని బెదిరించారు.

సోమవారం ఆయన మాట్లాడుతూ.. కావాలంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, బెదిరింపులకు భయపడబోనని స్పష్ట చేశారు. తనకు నోటీసులు ఇస్తే అందరి జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు. ఎవరివల్ల పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజల ముందు ఉంచుతానన్నారు.

గతంలో గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, పార్టీలో ఒకే కులం ఆధిపత్యం ఉన్నదని ఆరోపించారు. అసమర్థ నాయకులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన బీజేపీ విలీనం వ్యాఖ్యలను సమర్ధించారు.

పెద్ద ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరతారని, గతంలోనూ ఇలాంటి పొత్తుల వల్ల బీజేపీ నష్టపోయిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యవహారం తెలంగాణలో పార్టీకి తలనొప్పిగా మారిందని భావించిన అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకునే అధికారాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అప్పగించినట్లు సమాచారం.