03-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సోమవారం రాజ్భవన్లో అభినందన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీరికి తేనీటి విందు ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
72వ మిస్ వరల్డ్ పోటీ విజేత థాయ్లాండ్కు చెందిన ఓపల్ సుచాత చుయాంగ్శ్రీ, మొదటి రన్నరప్ హస్సట్ దేరేజే, రెండో రన్నరప్ మజ క్లాజ్డా, మూడో రన్నరప్ ఆరలియో జోఅచ్చిమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ సుచాతను గవర్నర్ సన్మానించారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు తనకు బాగా నచ్చాయని, ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ తన మరిచిపోలేనని మిస్ వరల్డ్ సుచాత పేర్కొన్నారు.
రాజ్భవన్లో ప్రపంచ సుందరీమణులకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం లభించింది. గిరిజనులు తయారు చేసిన స్వాగత వేదిక దగ్గర ఫొటోషూట్లో మిస్ వరల్డ్ విజేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.