calender_icon.png 18 June, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహక పురస్కారాలు

18-06-2025 07:05:39 PM

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంచిర్యాల పాపులర్ షూ మార్ట్ నిర్వహుకులు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. బుధవారం ప్రాఫిట్ షూ కంపెనీ(Profit Shoe Company) షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంచిర్యాల ఉమెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్(సిఐ) నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రాఫిట్ షూ కంపెనీ సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మంచి పరిణామం.

తెలుగు రాష్ట్రాలలోని ప్రతి జిల్లా స్థాయిలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థిని విద్యార్థులను, ప్రధాన ఉపాధ్యాయులను గుర్తించి ఆత్మీయంగా సత్కరించి ప్రోత్సాహక బహుమతులు అందించడం శుభ పరిణామం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మెరిసిన ఈ విద్యాకుసుమాలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం అని, విద్య ద్వారానే సమాజ స్థితిని, గతిని మార్చవచ్చని తెలిపారు. పేదరికం అభివృద్ధికి అడ్డు కాకూడదని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. నేడు ఉన్న స్థితిలో ఉన్న వారందరూ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు.

ఇలాంటి బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన ప్రాఫిట్ షూ కంపెని అధినేత బి.ఎస్ కోటేశ్వరరావు అందరికీ ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చక్కని ప్రతిభకు ప్రోత్సాహం అందించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపిక, ప్రశంసా పత్రంతోపాటు కళాశాల బ్యాగు, ఒక జత షూ, ఓ విజేత ఆత్మ కథ పుస్తకం, నోట్ బుక్స్ ఇతర విద్యా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో షూ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ ఆవునూరి ప్రశాంత్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కంపెని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.