11-10-2025 04:41:20 PM
సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మీడియా సమావేశం..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని 8 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేసి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉనికిని కోల్పోతున్నామని గమనించిన కల్వకుంట్ల కుటుంబం, బాకీ కార్డుల విడుదల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కుటుంబ కలహాలను కప్పిపుచ్చుకోవడానికే కొత్త కుట్రలు పన్నుతున్నారన్నారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయలేక రాష్ట్ర ప్రజలకు బాకీ పడిందన్నారు.
20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గడపగడపకు అందుతున్నాయని తెలిపారు. కేటీఆర్ తన అనుచరులతో సిరిసిల్లలో సహజ వనరులను కొల్లగొట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో దోపిడీదారులు, దగాకోరులకు స్థానం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, నాయకులు రాగుల జగన్, ప్రభాకర్, లక్ష్మీనర్సయ్య, రాము, శ్రీకాంత్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.