calender_icon.png 30 May, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ కవ్విస్తే భారత్ చూస్తూ ఊరుకోదు

27-05-2025 01:18:54 AM

  1. బహ్రెయిన్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

ఉగ్రవాదుల సంఖ్య పాక్‌లోనే ఎక్కువ: గులాం నబీ ఆజాద్

పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చేందుకు మద్దతివ్వాలని బహ్రెయిన్‌కు విజ్ఞప్తి

మనామా, మే 26: పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ చూస్తూ ఊరుకోదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’  తర్వాత ఉగ్రవాదంపై పోరును ప్రపంచ దేశాలకు వివరించే ప్రయత్నంలో భాగంగా బహ్రెయిన్‌లో భారత దౌత్య ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. ‘దాయాది దేశం దాడులకు దిగితే భారత్ నుంచి ప్రతిదాడులు భీకరంగా ఉంటాయి.

ప్రజల్ని మతం అడిగి మరీ హత్య చేయడమంటే అది ఇస్లామిక్ బోధనలను వక్రీకరించడమే అవుతుంది. పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతివ్వాలని బహ్రెయిన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం.’ అని ఒవైసీ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ‘ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్‌లోనే అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులున్నారు.

బహ్రెయిన్ వివిధ మతాల సమ్మేళనం. ఇక్కడి ప్రజల్లో ఎటువంటి విభేదాలు లేవు. బహ్రెయిన్ ఒక మినీ ఇండియాలా కనిపిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పండా నేతృత్వం వహిస్తున్న దౌత్య బృందంలో అసదుద్దీన్‌తో పాటు పాటు గులాం నబీ ఆజాద్, నిషికాంత్ దూబే, ఫాంగ్నోన్ కొన్యాక్, రేఖా శర్మ,  సత్నామ్ సింగ్, హర్ష్ సింగ్లా బృందంలో సభ్యులుగా ఉన్నారు.