calender_icon.png 31 May, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడులు పూర్తయ్యాకే పాక్ డీజీఎంవోకు సమాచారమిచ్చాం

27-05-2025 01:17:06 AM

  1. ఆపరేషన్‌కు ముందే పాక్‌కు సమాచారం అనేది అవాస్తవం

కాన్సులేటివ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ, మే 26: ఆపరేషన్ సిందూర్‌కు ముందే పాకిస్థాన్‌కు సమాచారం అందించారని కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో ఆ వార్తలపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ క్లారిటీనిచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం మంత్రి అధ్యక్షతన విదేశాంగ శాఖ కాన్సులేటివ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

‘కాంగ్రెస్ ప్రచారం చేసినట్టు ఉగ్రస్థావరాలపై దాడులు చేయకముందు పాక్‌కు సమాచారం ఇవ్వలేదు. అవన్నీ అవాస్తవాలు. దాడులు పూర్తయ్యాకే పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్‌కు సమాచారం ఇచ్చాం. అప్పటికే పీఐబీ తొలి ప్రకటన కూడా జారీ చేసింది. కాల్పుల విరమణలో అమెరికా జోక్యం ఏం లేదు. పాకిస్థాన్ డీజీఎంవో నుంచి వచ్చిన అభ్యర్థన మేరకే ఒప్పందం కుదిరింది.

అసలు కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వమే లేదు. పాక్ ద్వంద్వ వైఖరిని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టేందుకు మీ అందరి (ఎంపీలను ఉద్దేశించి) సహాయం కావాలి.’ అని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. సోమవారం కాన్సులేటివ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్నట్టు జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పలు చిత్రాలను పోస్ట్ చేశారు. ‘ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై భారత వైఖరి గురించి చర్చ జరిగింది.’ అని పేర్కొన్నారు.