25-06-2025 04:35:31 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని, ఇళ్ల నిర్మాణ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్యకు పరిష్కారం చూపి త్వరితగతిన బిల్లులు అందించి ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బయ్యారం మండలం నామాలపాడు గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు పథకంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇండ్ల నిర్మాణం ప్రాతిపదికన విడతలవారీగా 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ సూచనల ప్రకారం ఇందిరమ్మ కమిటీల ద్వారా ఐటీడీఏ, పట్టణ, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు 85 శాతం ఇండ్ల నిర్మాణం గ్రౌండ్ లెవెల్ పూర్తిచేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను పంపిణీ చేసి, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం నిమిత్తం బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో విజయలక్ష్మి, డాక్టర్ విజయ్ , హౌసింగ్ ఏఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.