27-05-2025 01:13:09 AM
- తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి
- మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): అంగవైకల్యం కింద ట్రాన్స్ జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం 2024 డిసెంబర్లో హైదరాబాద్లో 44 మంది ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిందని, ఇలా తీసుకోవడం దేశంలోనే మొదటిసారి అని తెలిపారు.
ప్రభుత్వం దీనిని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని, ఆరు నెలల తర్వాత వీరి ప్రవర్తన, వారిపై వచ్చే అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని గతంలోనే కోరిందని, వీరి విధులు అందరినీ సంతృప్తి పరిచాయని అభినందించారు. సోమవా రం సచివాలయంలో మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశచరిత్రలోనే ఒక మైలురాయన్నారు. ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించడంలో ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదిశగా చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
పోలీస్శాఖలోనే కాకుండా ఇతర విభాగాల్లోనూ ట్రాన్స్జెండర్లను నియమించే ఆలోచనలో సీఎం రేవంత్రెడ్డి ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్, అధికారులు బీ శైలజ, ఎన్జీవోల సభ్యులతోపాటు ఇటీవల నియమితులైన ట్రాఫిక్ అసిస్టెంట్లు హాజరయ్యారు.