26-06-2025 11:24:03 PM
బీజేపి నిరసన..
కోహెడ ఎంపీడీవో ఆఫీసు వద్ద ప్లకార్డులతో ధర్నా..
కమిటీలకు సంబంధం లేకుండా అధికారులే ఎంపిక చేయాలని డిమాండ్..
హుస్నాబాద్: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా(Siddipet District) కోహెడ ఎంపీడీవో ఆఫీసు వద్ద బీజేపి కోహెడ మండలశాఖ నేతృత్వంలో గురువారం గంటసేపు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్లకార్డులు చేతపట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు జాలిగం రమేశ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మండలంలోని 27 గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ కమిటీలకు సంబంధం లేకుండా అధికారులే ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభల్లో అర్హులైన జాబితాలో పేర్లు చదివిన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేయాలని, కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా అసలైన పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. నిరసన అనంతరం, ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ సంపత్ కు అర్హులైన కొంతమంది జాబితా పేర్లతో పాటు వినతిపత్రాన్ని ఇచ్చారు.