05-12-2024 01:48:17 AM
సూర్యాపేట జిల్లాలో కేంద్ర విపత్తు అంచనా నిపుణుల బృందం పర్యటన
సూర్యాపేట, డిసెంబర్ 4 (విజయక్రాంతి)/హుజూర్నగర్: సూర్యాపేట జిల్లాలో విపత్తు అంచనా నిపుణుల కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. ఏ ప్రదీప్కుమార్ నేతృత్వంలోని కేంద్ర విపత్తు నిర్వహణ అంచనా నిపుణుల బృందం ముందుగా కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం అంచనాల నివేదికలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వరదల వలన నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు.
వరదల వలన జరిగిన నష్టాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బృంద సభ్యులకు వివరించారు. జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన బృంద సభ్యులు పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు.