సికింద్రాబాద్ జోన్ హోటళ్లలో తనిఖీలు
రెండు హోటళ్లకు నోటీసులు జారీ
సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారు
సికింద్రాబాద్, ఫిబ్రవరి28 (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఆహార విక్రయ కేంద్రాలపై జీహెచ్ఎంసీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారు, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ కాంత్, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాతి, సాహితీ, కవాడి గూడ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్, డిప్యూటీ ఎస్ఎం డబ్ల్యూ బృందాలు కలిసి కవాడిగూడ సర్కిల్లోని అమంత్రన్ హోటల్ అండ్ బ్యాంక్వెట్స్ ,సమోసా ఖార్ఖాన ప్రాంగణాలను తనిఖీ చేశారు.
తనిఖీలలో పరిశుభ్రత లోపాలు, శానిటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం, రికార్డుల సక్రమ నిర్వహణ లేకపోవడం,గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వ, అనధికారిక ఫుడ్ కలర్స్ వినియోగం వంటి ఉల్లంఘనలు జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలో గుర్తించారు.ఈ నేపథ్యంలో సంబంధిత యాజ మాన్యాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆహార భద్రతా చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో హోటల్ లు, ఆహార విక్రయ కేంద్రాల్లో శుచి,శుభ్రత పాటించాలి.ఆహార భద్రత ప్రమాణాల నిక్కచ్చిగా పాటించాలని తెలియజేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన, ఆహారం, తినుబండారాల్లో నాణ్యత లోపించిన, అపరిశుభ్రత వాతావరణం ఉన్న, చట్టం ప్రకారం చర్యలు తప్పవ ని జీహెచ్ఎంసీ అధికారుల స్పష్టం చేశారు.




