25 February, 2026 | 3:38 AM

నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు

25-02-2026 12:29 AM

సమయానికి పరీక్షా కేంద్రంకు విద్యార్థులు హాజరు కావాలి

పరీక్ష నిర్వహణధికారి చీఫ్  సూపరిండెంట్  బలరాం

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24 : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరానికి ఈనెల 25 నుండి మార్చి 18 వరకు  పరీక్షలు  నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా  యాదగిరిగుట్ట  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు  నిర్వాహణాధికారులు చీప్ సూపరీడెంట్  బలరాం , డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అంతయ్య  తెలిపారు. మంగళవారం కళాశాల తరగతి గదుల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లు వేశారు.

పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో భాగంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సకాలంలో ఉదయం 8.30 నిమిషాల లోపు పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని, పరీక్షలు 9 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. 

ఈసారి నిమిషం నిబంధనను సడలించారని, సరైన కారణం చూపితే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని తెలియజేశారు. యాదగిరిగుట్టలో గల ప్రభుత్వ జూనియర్, ప్రైవేట్ కళాశాలలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు 220, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 170, మంది పరీక్షలకు  హాజరవుతారని తెలియజేశారు.

అదేవిధంగా పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు , ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రంలో ప్రత్యేకంగా గడియారం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు చేతి గడియారాలు తీసుకురావాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈ సీసీ కెమెరాలు ఇంటర్మీడియట్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానంగా ఉండి పనిచేస్తాయని తెలియజేశారు.పరీక్షల నిర్వహణకు సంబంధించిన విషయాలను ఇన్విజిలేటర్లకు తగు సూచనలు చేశారు.