25-11-2025 02:28:15 PM
న్యూఢిల్లీ: దుబాయ్కు చెందిన భారతీయ మాదకద్రవ్యాల వ్యాపారి పవన్ ఠాకూర్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో బృందం మంగళవారం దుబాయ్లో అరెస్టు చేసింది. ఠాకూర్ ను త్వరలోనే భారతదేశానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న రూ.282 కోట్ల విలువైన మెత్ డ్రగ్స్ వెనుక ఠాకూర్ ప్రధాన సూత్రధారి అని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, గత ఏడాది నవంబర్లో ఢిల్లీలో బయటపడిన రూ.2,500 కోట్ల కొకైన్ రాకెట్ వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు సమాచారం.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అతనికి సంబంధించిన స్థావరాలపై దాడులు నిర్వహించి 118 మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసింది. సెప్టెంబర్లోనార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఠాకూర్ పై సిల్వర్ నోటీసు జారీ చేసినట్లు ధృవీకరించింది. ఇంటర్పోల్తో సన్నిహిత సమన్వయంతో ఎన్సీబీ మొదటి సిల్వర్ నోటీసును విజయవంతంగా ప్రచురించి, పవన్ ఠాకూర్ అనే నిందితుడిపై ఉందని ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
దుబాయ్కు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారి పరారీలో ఉన్న వ్యక్తి అని, గత నవంబర్లో ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న కొకైన్ దిగుమతి, ఎగుమతి, అక్రమ రవాణా వెనుక సూత్రధారి అని ఏజెన్సీ పేర్కొంది. అతను భారతీయ ఓడరేవు ద్వారా సరుకు దిగుమతికి చేసుకొని, రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి సరుకును తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఠాకూర్ సహచరులు ఢిల్లీలో అక్రమ వస్తువులను నిల్వ చేయడం, సంరక్షించడం నిర్వహించేవారు, సజావుగా పంపిణీ జరిగేలా అతను వ్యక్తిగతంగా హ్యాండ్లర్లలో మధ్యవర్తిత్వం వహించాడని ఎన్సీబీ తెలిపింది.
ఠాకూర్ దుబాయ్, ఢిల్లీలో స్థావరాలతో హవాలా నెట్వర్క్ను నిర్వహిస్తున్నాడని, అక్రమ నిధులను, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయాన్ని తన సహచరుల ద్వారా అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి అక్రమంగా మళ్లిస్తున్నాడని ఎన్సీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. పవన్ ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తున్నాడని, అక్కడి నుండి తన మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ సిండికేట్ను నిర్వహిస్తున్నాడని అధికారులకు సమాచారం అందింది. ఎన్సీబీ ఠాకూర్ పై ఢిల్లీలోని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అతను 2019 నుండి దుబాయ్లో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.