ఇరాన్కు మరో షాక్.. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ హతం
టెహ్రాన్: ఇరాన్కు మరో భారీ షాక్ తగిలింది. వరుసగా టాప్ లీడర్లను ఇరాన్ కోల్పోతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో సోమవారం జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (Islamic Revolutionary Guard Corps) ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ ఖాదేమి(Majid Khademi killed) మరణించినట్లు ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. తెల్లవారుజామున జరిగిన ఒక దాడిలో సయ్యద్ మజీద్ ఖదేమీ మరణించారని ఐఆర్జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఆయన ఎక్కడ మరణించారనే విషయాన్ని ఆ ప్రకటన పేర్కొనలేదు.
ఖదేమి సుమారు 50 ఏళ్ల పాటు సేవలందించారని, నిఘా, భద్రతా విభాగాలలో కీలక పాత్రలు పోషించారని ప్రకటన పేర్కొంది. ఇరాన్లోకి శత్రువుల చొరబాట్లను అడ్డుకోవడంలోనూ, ప్రభుత్వ భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పికొట్టడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని అందులో తెలిపారు. హతమైన అత్యున్నత స్థాయి ఇరాన్ అధికారుల జాబితాలో ఖాదేమి తాజా వ్యక్తి. గత నెలలో దివంగత సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ తర్వాత దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా విస్తృతంగా పరిగణించబడే ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానిని, అలాగే గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను ఇజ్రాయెల్ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే హతమార్చింది. అటు అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ దిశగా ముందుకు సాగుతున్నాయి. 45 రోజులపాటు కాల్పుల విరమణకు ప్రతిపాదించాయి. హర్మూజ్ను తెరవాలని అమెరికా ప్రతిపాదన పెట్టింది. చర్చలకు పాక్, తుర్కియో, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.




