calender_icon.png 3 December, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల తయారీ ముఠాపై ఉక్కుపాదం

03-12-2025 12:15:35 AM

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): దేశంలో ఆర్థిక అస్థిరతను సృష్టిస్తున్న  నకిలీ నోట్ల తయారీ,చలామణి ముఠాను కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ  ఉక్కు పాదం మోపుతుంది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కట్టడి చేయాలనే ఉద్దేశంతో నకిలీ నోట్ల అంతర్రాష్ట్ర చలమాని మూట సభ్యులపై పిడి యాక్ట్   ను కామారెడ్డి పోలీసులు అమలు పరుస్తున్నారు.

ఈ చర్యల్లో భాగంగా, కీలక నిందితులపై పి డి యాక్ట్ అమలు చేస్తూ, అంతర్రాష్ట్ర ముఠాలోని మరో ఇద్దరు కీలక సభ్యులపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్ షాపులో రెండు నకిలీ 500 నోట్లు వినియోగించిన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన జిల్లా పోలీసులు తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో నకిలీ నోట్ల అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుకోవడమే కాకుండా వారి మూలాలను సైతం చేజెక్కించుకున్నారు. ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇప్పటికే లఖన్ కుమార్ దుబే (మధ్యప్రదేశ్), సత్యదేవ్ యాదవ్ (ఉత్తర్ ప్రదేశ్), సౌరవ్ డే (పశ్చిమ బెంగాల్) కు చెందిన ముగ్గురిపై పి.డి యాక్ట్ అమలు చేశారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు, ఉత్తర ప్రదేశ్ కి చెందిన దివాకర్ చౌదరి, పశ్చిమ బెంగాల్ కు చెందిన హరి నారాయణ భగత్ @ సంజయ్ పై నిందితులు ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉన్నారు. జిల్లా కలెక్టర్,  జారీ చేసిన పి డి యాక్ట్ ఉత్తర్వులను మరో ఇద్దరికి కామారెడ్డి టౌన్ ఎస్ హెచ్ ఓ నరహరి, హెడ్ కానిస్టేబుల్ వి.ఎల్. నర్సింలు అధికారులు అధికారికంగా అందజేశారు.

నకిలీ కరెన్సీ చలామణి ద్వారా ప్రజల్లో భయం, ఆర్థిక అస్థిరత సృష్టించే వారిని అరికట్టడంలో పి.డి యాక్ట్ కీలకమైన చట్టం. ఈ ఉత్తర్వుల ప్రకారం నిందితులు ఒక సంవత్సరం వరకు బెయిల్ లేకుండా జైల్లోనే నిర్బంధంలో ఉండనున్నారు. నకిలీ కరెన్సీ నేరాలను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు జిల్లా పోలీసులు ఉక్కుపాదంతో వ్యవహరిస్తున్నారని, ఇటువంటి తీవ్రమైన ఆర్థిక నేరాలపై ఎటువంటి సడలింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీయం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ,నకిలీ నోట్ల ముఠాలు అమాయక ప్రజలను మోసం చేయడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలవు. ఇలాంటి నేరగాళ్లపై కామారెడ్డి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంటారు. నేరాలకు దూరంగా ఉండి బాధ్యతాయుత పౌరులుగా జీవించడం ప్రతి ఒక్కరి ధర్మంఅని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.