31-05-2025 02:10:04 AM
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత సైనికులు అద్భుతమైన విజయాన్ని సాధించారని, సీఎం రేవంత్రెడ్డి వారిని తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఒక్క సీఎం రేవంత్రెడ్డినే కాక ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా సైతం సైన్యాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాము కోలుకోకముందే భారత సైన్యం పాక్పై విరుచుకుపడిందని సాక్షా త్తు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ఒప్పుకొన్నారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ నేతలు వితండవాదం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని రాఫెల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పమని సీఎం రేవంత్ అడగటం సిగ్గుచేటన్నారు. దేశరక్షణకు సంబంధించిన సున్నితమైన అంశాలపై ఎలా మాట్లాడాలో తెలియని ప్రతిపక్షనేతగా రాహుల్గాంధీ ఉండటం దేశ ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు.
ఢిల్లీలో బడేమియా రాహుల్గాంధీ మాటలకు వత్తా సుగా, హైదరాబాద్లో చోటేమియా రేవంత్ కాపీ, పేస్ట్ ప్రశ్నలనే బీజేపీకి సంధిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు యుద్ధాలు వచ్చినా దేశంలోని రాజకీయపార్టీలు, కుల మతాలను పక్కనపెట్టి ప్రజలు సైనికులకు అండగా నిలి చారని కొనియాడారు. పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం కూడా దేశ ప్రజలంతా సైనికులకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని, తద్వారా ఉగ్రవాదులకు బుద్ధిచెప్పాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉందని, అందుకే ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ అమలు చేశారని స్పష్టం చేశారు. వెంటనే భారతసైన్యం రంగంలోకి దిగి అనేక ఉగ్రవాద స్థావరాలతో పాటు పాక్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2016లో పటాన్కోట్లో సర్జికల్ స్ట్రుక్స్, 2019లో బాలకోట్ వద్ద ఎయిర్స్ట్రోక్ జరిగిందని గుర్తుచేశారు.
తిరంగా ర్యాలీ బీజేపీ కార్యక్రమమా?
సైనికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీజేపీ దేశవ్యాప్తంగా జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించిందని, కానీ.. ప్రతిపక్ష నేతలు ఆ ర్యాలీని బీజేపీ కార్యక్రమమని పేర్కొనడం దుర్మార్గమన్నారు. పాకిస్థాన్ కూడా రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చినట్టు ఎక్కడా మాట్లాడలేదని, కానీ రాహుల్ గాంధీ మాత్రం ఎన్ని రాఫెల్స్ కూలిపోయాయో చెప్పాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రం ఇప్పుడు ప్రపంచ దేశాల ఎదుట పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వచ్చి రాహుల్గాంధీ అపాయింట్మెంట్ కోసం మూడురోజుల పాటు పడిగాపులు కాశారని, హైదారబాద్ తిరిగి వెళ్లాక రాహుల్ గతంలో మాట్లాడిన మాటలను వల్లె వేస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పీవోకేను స్వాధీనం చేసుకునేవాళ్లమంటూ సీఎం బీరాలు పలుకుతున్నారని, అసలు పాకిస్థాన్కు పీవోకేను కట్టబెట్టిందెవరో..? సీఎం తెలుసు కోవాలని హితవు పలికారు.
1971 యుద్ధంలో భారతసైన్యం పాకిస్థాన్లోని లాహోర్ వరకు చొచ్చుకుపోయిందని, అప్పుడు పీవోకేను తీసుకురాకుండా కాంగ్రెస్ మిన్నకుండిపోయిందని గుర్తుచేశారు. పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు నాడు అవకాశం ఉన్నప్పటికీ, 93 వేల మంది పాకిస్థాన్ సైనికులను బేషరతుగా విడిచిపెట్టిన సంగతిని గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దేశంలో వందలాది ఉగ్రదాడులు జరిగాయని దుయ్యబట్టారు.
భారత సైన్యానికి కాంగ్రెస్ ఏనాడూ స్వేచ్ఛనివ్వలేదని, కానీ.. స్వేచ్ఛనిచ్చి ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన బీజేపీపై మాత్రం విషం కక్కుతున్నదని నిప్పులు చెరిగారు. ఒకప్పుడు జమ్మూకశ్మీర్లో ఎన్నికలంటే కేవలం 2, 3 శాతం పోలింగ్ జరిగేదని, కానీ ఆర్టికల్ తొలగింపు తర్వాత అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.
ఇప్పుడు కశ్మీర్ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగిందన్నారు. కేంద్రం అమలు చేసిన ‘అగ్నివీర్’ పథకాన్ని నాడు రాహుల్గాంధీ విమర్శించారని, ఇప్పుడు ఆ పథకం ద్వారానే సైన్యంలోకి వచ్చిన 3 మంది యువత దేశానికి రక్షణగా నిలుస్తున్నారని కొనియాడారు.
కేసీఆర్ ఇంట్లో ఫ్యామిలీ డ్రామా..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ, ఆ మేరకు గతంలో ప్రతిపాదనలు వచ్చాయంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితకు విశ్వసనీయత లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొట్టిపడేశారు. విశ్వసనీయత లేనివారి వ్యాఖ్యలకు తాను సమాధానం ఇవ్వలేనని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని, ఆ డ్రామాతో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజలకు అంతకంటే లేదని పేర్కొన్నారు.