calender_icon.png 1 June, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

67 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం

31-05-2025 02:06:04 AM

  1. రూ.13,250 కోట్లు రైతులకు చెల్లించాం
  2. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి                                                                
  3. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తాం: మంత్రి తుమ్మల       
  4. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి కోమటిరెడ్డి

సూర్యాపేట, మే 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో యాసంగిలో పండించిన ధాన్యం మే 29 నాటికి 67 లక్షల టన్నులు కొనుగోలు చేశామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రైతులకు రూ.13,250 కోట్లను చెల్లించామని వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే 20 లక్షల టన్నులు ఎక్కువగా కొన్నామని తెలిపారు. కాగా 2023 మే 29 నాటికి బీఆర్‌ఎస్ ప్రభు త్వం కేవలం 47 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే కొని, రైతులకు రూ. 3,600 కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు.

తమ ప్రభుత్వం అంతకుమించి రైతులకు సదుపాయాలు కల్పించి, ధాన్యం కొన్నామని చెప్పారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణ, వ్యవసాయం, రుతుపవనా లు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి పథకాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా కు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరై మాట్లాడారు. సన్నబియ్యంపై సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

గతంలో 2.87 కోట్ల మందికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం అందించగా, 70 శాతం అక్రమంగా తరలించబడిందని ఆరోపించా రు. తమ ప్రభుత్వం సన్నబియ్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నదని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నామన్నారు. కాలేశ్వరం లేకున్నప్పటికీ ఈ వర్షాకాలం యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. 

పథకాల అమలుకు పునరంకితం: మంత్రి తుమ్మల

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సం క్షేమ పథకాల అమలుకు అధికారులు, ఉద్యోగులు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి పునరంకితం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇరిగేషన్ విషయంలో కృష్ణాజలాలను పూర్తి గా వాడుకునేందుకు తమ హయాంలోనే ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తామన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మంజూరు చేస్తామని, ఇందుకుగాను స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆయిప్‌పామ్ ఎక్కువ పండే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల మధ్యనే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. 

ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు: మంత్రి కోమటిరెడ్డి 

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కలెక్టర్లదేనని రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకు అదనపు గోదాములు, క్లస్టర్లను, ఏఈవో పోస్టులను మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.  భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.