31-05-2025 02:21:39 AM
మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు
‘ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ అంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వీరిద్దరిని ప్రయోగించనున్న కమలనాథులు!
తమిళనాడులో హీరో విజయ్తో పొత్తుకూడి.. డీఎంకేను దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీ
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ ఇప్పుడు దక్షిణాన మరో రెండు రాష్ట్రాలపై కన్నేసింది. తెలంగాణలో అధికార పీఠాన్ని ఇప్పటికే గురిపెట్టిన కమలనాథులు మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలపై దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని పట్టుదలతో ఉన్న కమలం పార్టీ అందుకు వ్యూహరచన చేస్తున్నది.
హైదరాబాద్ను తనే అభివృద్ధి చేశానని, తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరపైకి తేవడం ఇందులో భాగమే. సినీ స్టార్గా తెలంగాణలోనూ అభిమానులను అలరిస్తున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కూడా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వారే. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో అని, ఆ నేలకు తానెప్పుడూ శిరస్సు వంచి నమస్కరిస్తానని పవన్కల్యాణ్ చెప్తుంటారు.
తన ‘కర్మభూమి’ ఆంధ్రప్రదేశ్ అయినా, తను ‘ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ అనే రీతిలో ఆయన తన అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేన నేత పవన్కల్యాణ్ నిజానికి బీజేపీకి ‘రెండు కళ్లు’. వారిద్దరిని తెలంగాణలో ప్రయోగిస్తే బీజేపీకి సత్ఫలితాలు రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అప్పుడు తెలంగాణ యవనికపై ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ బలమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక తమిళనాట యువత, మహిళలను సీటీ కొట్టించే పాపులారిటీ ఉన్న అగ్రశ్రేణి హీరో విజయ్. సొంత పార్టీ పెట్టిన విజయ్ని బీజేపీ తమ వైపుకు తిప్పుకుంటే పరిస్థితి ఏమిటని డీఎంకే సందిగ్ధంలో పడింది. ఇప్పటికే విజయ్ని బీజేపీ ఒకసారి సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన డీఎంకే, ప్రముఖ నటుడు కమల్హాసన్ను అక్కున చేర్చుకున్నది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కి పోటీగా కమల్ను రంగంలోకి దింపాలని డీఎంకే భావిస్తున్నది. అందుకే కమల్కు డీఎంకే రాజ్యసభ సీటు ఇచ్చింది. అన్నాడీఎంకేతో ఇప్పటికే చేతులు కలిపిన కమలనాథులు, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాగైనా డీఎంకే కోటను బద్దలు కొట్టాలని పథక రచన చేస్తున్నారు.
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): చంద్రబాబుది తెలంగాణపై మొదటి నుంచీ రెండు కళ్ల సిద్ధాంతమే. అయితే అవ కాశానుగుణంగా ఈ సిద్ధాంతాన్ని ఆయన అనుసరిస్తూనే వచ్చా రు. 2014కు ముందు రెండు ప్రాంతాలు రెండు కళ్లంటూ వచ్చిన బాబు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బలవంతంగానైనా ఏపీకి వెళ్లిపోవాల్సి వచ్చింది. మధ్యలో ఓసారి ఓటమి పాలైనా ఇప్పుడు ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చి తెలంగాణలోనూ చక్రం తిప్పే ప్రయత్నం చేస్తు న్నారు.
అందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా అక్రమంగా నీటిని తరలించుకుపోయే ప్రయత్నం చేస్తున్నా కూడా తెలంగాణ ప్రజలు దూరం కాకుండా ఉండేందుకు ఇన్నాళ్లుగా అటక మీద ఉంచిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మళ్లీ బూజు దులిపి వినియోగించడం ప్రారం భించారు. అయితే చంద్రబాబు తెలంగా ణపై ప్రేమ కురిపించే మాటలు మాట్లాడేందుకు ప్రధాన కారణం బీజేపీ అని బాబు ను బాగా ఎరిగిన వారు చెపుతున్నారు.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే దూరదృష్టితో బీజేపీ చంద్రబాబుతో సహ ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సాయం తీసుకునేందుకు వ్యూహ రచన చేస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే బనకచర్ల అంశంలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు తెలంగాణ వదిలేసి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటినే తాము ఈ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్నామని చంద్రబాబు పేర్కొంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక పవన్ కల్యాణ్ సైతం తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధపడుతున్నట్లుగా ఆయన అనుచర గణం అంటోంది. అందుకే ఆయన అభిమానులతో అప్పుడప్పుడు ఏదో విధంగా హల్చల్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపునకు బాబు, పవన్ సాయం తీసుకోవడమో.. కలిసి పోటీ చేయడమో ఏదో ఒకటి పక్కాగా ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తమిళనాడులో మాత్రం హీరో విజయ్తో బీజేపీ తప్పనిసరిగా పొత్తు కుదుర్చుకుని ముందుకు పోతుందని తద్వారా అక్కడ అధికారాన్ని పొందాలని చూస్తోందని తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ పాగా వేసినట్లే తమిళనాడులోనూ మిత్రపక్షాలతో కలిసి ముందుకు పోవాలనేది ఎత్తుగా భావిస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ జేడీయూతో పొత్తుతో దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని తెలుస్తోంది.
బనకచర్లతో ఎవరికీ నష్టముండదు
కడపలో జరిగిన మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోలవరం వల్ల ఎవరికీ నష్టం జరగదని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తనకు రెండు కళ్లు అని సీమ వేదికగా మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందన్నట్లు బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని ఇది సరికాదని వ్యాఖ్యానించడం చూస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కాదని కేవలం ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ను మాత్రమే బాబు టార్గెట్ చేస్తూ తెలంగాణలో రీఎంట్రీకి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెపుతున్నారు.
“పోలవరం పూర్తయితే రాష్ర్ట ముఖచిత్రమే మారుతుంది. వంశధారను గోదావరి నదితో అనుసంధానం చేస్తాం. నదులు అనుసంధానం చేసి తెలుగు నేలకు జలహారతి ఇస్తాం. చివరన ఉన్న ఏపీలో సముద్రంలోకి వెళ్లే నీళ్లను వాడుకోవాలి. మిగిలిన నీళ్లను రాయలసీమ కరువు ప్రాంతాలు వాడుకుంటాయి. తెలంగాణకు కూడా లాభం తప్ప ఎవరికీ నష్టం కాదు. తెలంగాణకు నష్టం వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. గోదావరిపై తెలంగాణలో ప్రాజెక్టు కడితే మేం అభ్యంతరం చెప్పలేదు.
తెలంగాణ, ఏపీ నాకు రెండు కళ్లు అని ఆనాడూ చెప్పాను” - అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన తెలంగాణ ప్రజలకు మరింతగా దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు అవసరమైతే టీడీపీని నేరుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పెట్టడమో లేక బీజేపీకి మద్దతు ఇవ్వడమో చేస్తుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు బీజేపీ అధిష్ఠానం ఏం చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నారని దాన్ని బట్టి ఎన్నికల నాటి పరిస్థితుల ప్రకారం వ్యూహం ఉంటుందని బీజేపీ నేత ఒకరు తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే
ఏపీ సర్కారు నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై రెండు కళ్ల సిద్ధాంతంతో పాటు హైదరాబాద్ను అభివృద్ధి చేసిందే నేనే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే తెలంగాణపై ఆయన ఇంకా ఆశలు వదులుకోలేదని అర్థమవుతోంది. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండబోదని ఆయన పదేపదే చెప్తూ తెలంగాణపై తనకు ప్రేమ తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సముద్రంలో కలిసే నీటిని కాపాడుకోవడమే తమ ప్రణాళిక అని నదుల అనుసంధానైం తెలంగాణకు కూడా లాభమేనంటూ పేర్కొనడం చూస్తే ఇక్కడ ఏదో రూపంలో పాగా వేసే ప్రయత్నంగానే విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, గోదావరిపై ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ర్టం, ఆ తర్వాత నీళ్లు సముద్రంలోనే కలుస్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత సముద్రం తప్పా వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్పా ఎవరికీ నష్టం లేదంటూ చంద్రబాబు తెలంగాణ ప్రజల మనసు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్నారు.
తెలంగాణలో జనసేనతో..
సినీహీరోగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి అన్నింటా విజయం సాధించి ఏపీ డిఫ్యూటీ సీఎం అయిన పవన్కళ్యాణ్కు తెలంగాణలోనూ భారీగా అభిమానులున్నారు. వీరిలో చాలామంది జనసేన పార్టీ నేతలుగానూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో ఏపీ సెటిలర్లు జనసేన, పవన్ అభిమానులమంటూ అనేక సార్లు నగరంలో హల్చల్ చేసిన ఘటనలున్నాయి.
ఇప్పుడు పవన్కళ్యాణ్ చంద్రబాబులా ప్రత్యేకంగా తెలంగాణపై ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా ఇక్కడ ఆయన కూడా అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం సనాతన ధర్మం పేరిట హిందుత్వానికి, బీజేపీకి బాగా దగ్గరైపోయిన పవన్కళ్యాణ్.. తెలంగాణకు సరిగ్గా సరిపోయే వ్యక్తిగా బీజేపీ అంచనా వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి పవన్కళ్యాణ్ను సైతం ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగానీ రంగంలోకి దించాలనేది కమలనాథుల వ్యూహంగా చెపుతున్నారు.
విజయ్తో డీఎంకేకు చెక్పెట్టే యత్నం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమిళనాడు ఎప్పటి నుంచో బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉంది. ఎలాగైనా తమ ప్రభావం చూపించాలని ప్రయత్నం చేస్తున్నా తమిళనాడు అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కొత్త అవకాశాన్ని వెదుక్కుందని అంటున్నారు.
ఈసారి అధికార డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వాదనలు తమిళనాట జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే జరుగుతున్న ప్రచారంపై విజయ్గానీ, ఆ పార్టీ నేతలుగానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మొదట విజయ్ను బీజేపీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేయించి సత్తా చాటేలా చేయాలని బీజేపీ అధిష్ఠానం ప్రయత్నించినా తమిళ రాజకీయ పరిస్థితుల కారణంగా స్థానికంగా పార్టీ ఏర్పాటే మేలని విజయ్ నిర్ణయించుకున్నారని ఆ మేరకే ముందుకు సాగారని తమిళ రాజకీయ పండితులు చెపుతున్నారు.
అయితే బీజేపీతో మాత్రం ఆయన టచ్లో ఉన్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే, టీవీకేతో కలిసి బీజేపీ కూటమి ఏర్పాటు చేయాలని, ఆ విధంగా తమిళనాడులో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజాకలం:
తెలుగుదేశం, జనసేన పార్టీలను బీజేపీ తెలంగాణలో తెరపైకి తెస్తే, బీఆర్ఎస్ నెత్తిన పాలుపోసే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ తన ఉనికిని చాటుకునేం దుకు ఉవ్విళ్లూరుతున్నది. మరోపక్క, జనసేన నేత పవన్ కల్యాణ్కు కూడా తెలంగాణలో వేలసంఖ్యలో అభిమా నులున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రంగంపైకి ఈ రెండు పార్టీలు వస్తే ఆ పార్టీలను బయటి పార్టీలుగా ప్రచా రం చేస్తూ బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు.
దక్షిణాదిపై గురి
ఉత్తరాదిలో పరిస్థితులు ఒక్కోసారి తలకిందులు అవుతున్న నేపథ్యం లో కొత్తగా ఓటు బ్యాంకు, సీట్లు పొందాలనేది బీజేపీ ఎత్తుగడ. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ 8 ఎంపీ సీట్లు సాధించడమే ఇందుకు ఉదాహరణ. నమ్ముకు న్న ఉత్తరాది కొంప ముంచినా దక్షిణాదిని పట్టుకుని బయట పడవచ్చనేది కమలనాథుల ప్లాన్.
ఈ మేరకే దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ తద్వారా ఏపీ సర్కారులో భాగంగా మారింది. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారం తమదే అనే ధీమా కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ భారీ వైఫల్యం వల్ల వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ కన్నడ నేతలు చెపుతున్నారు.