22-06-2025 12:06:14 AM
- డీఆర్డీవో అభివృద్ధి చేసిన క్షిపణులను ఉపయోగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం
- ఇరాన్ యూఏవీలను సమర్థంగా కూలుస్తున్న బరాక్ మిసైల్స్
న్యూఢిల్లీ, జూన్ 21: ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన అత్యాధునిక బరాక్ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించింది. ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్లోకి దూసుకొచ్చిన ఇరాన్ యూఏవీలను బరాక్ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాగా యూఏవీలు, క్రూయిజ్ క్షిపణులు , ఇతర వైమానిక ముప్పుల నుంచి రక్షణ కోసం బరాక్ వ్యవస్థను భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)తో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. ఇందులో డ్యూయల్ రాకెట్ మోటార్ వంటి కీలకమైన భాగాలను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. మానవ రహిత ఏరియల్ వాహనాలతో పాటు మిసైళ్లను కూడా బరాక్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో బరాక్ క్షిపణి వ్యవస్థను భారత్ ఉపయోగించింది. పాకిస్థాన్కు చెందిన ఫతా మిసైల్స్ను బరాక్ వ్యవస్థతోనే అడ్డుకున్నారు.
ఏమిటీ బరాక్ క్షిపణి వ్యవస్థ?
బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక అత్యాధునిక వ్యవస్థ. షార్ట్ టు మీడియం రేంజ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. రాడార్ ద్వారా సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్స్ను విడుదల చేస్తుంది. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్లను అడ్డుకునే సామర్థ్యం బరాక్ క్షిపణి వ్యవస్థ సొంతం. ఎయిర్క్రాఫ్ట్, క్రూయిస్ మిసైళ్లు, సీ టు సీ మిసైల్స్, రాకెట్లు, బాలిస్టిక్ క్షిపణులను బరాక్ వ్యవస్థ చిత్తు చేస్తుంది. 30, 70, 150 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.