16-06-2025 12:00:00 AM
-ఇన్చార్జి మంత్రి బాధ్యతలపై పునరాలోచించాలి:తుడుం దెబ్బ
-ఆదివాసీలను అవమానపరచడం తగదు: గోడం గణేష్
ఆదిలాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్జి మంత్రి గా ఆదివాసీ బిడ్డ, ధనసరి సీతక్కనే యథావిధిగా కొనసాగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్ చేశారు. మావల మండలం కొమురం భీం కాలనీలో స్థానిక ఆదివాసీలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భం గా గోడం గణేష్ మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల జిల్లా అని చెప్పే పాలక ప్రభుత్వాలు ఆదివాసీలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా, మరీ ముఖ్యంగా ఆది వాసీ మహిళలు ముందుకు వచ్చి రాజకీయంగా తనకు తాను అభివృద్ధి చెందు తున్నారన్నారు. ఆకాశంలో సగం పోరాటంలో సగం భాగం అంటూ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసి, రాష్ట్రంలోనే ఆదివాసీ మహిళలలోనే ధనసరి సీతక్క ఒక్కరన్నారు.
అడవితల్లి ముద్దుబిడ్డ ఆదివాసీల ఆశాజ్యోతి సీతక్క జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి మన్నాన్నలను పొందుతూ, ముఖ్యంగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలుతో పాటు ఆదివాసి చట్టాలు హక్కులు ఆదివాసీల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉండి సమస్యల పరిష్కారం కోసం, అన్ని వర్గాల ప్రజల సమస్యలను ఇప్పుడిప్పుడే కృషి చేస్తున్న మంత్రి సీతక్కని ఇంచార్జీ నుండి మార్చడం ఆదివాసులను అవమానపరచడమే అవుతుందన్నారు.
ఆదివాసీలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచడమే అవుతుంది అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఇప్పటికే ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకునేవారు అయితే మంత్రి సీతక్క విషయంలో పునరా ఆలోచన చేయాలన్నారు. తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక తదితరులు ఉన్నారు.