calender_icon.png 29 June, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవోపేతంగా జగన్నాథుని రథోత్సవం...

29-06-2025 12:38:05 AM

వేడుకలో పాల్గొని రథాన్ని లాగిన ఎంపీ ఎమ్మెల్యే...

వేలాదిగా తరలివచ్చిన భక్తుల శ్రీకృష్ణుని నామస్మరణతో మార్మోగిన పట్టణం

అదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ లో ఇస్కాన్ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర వైభవంగా సాగింది. శనివారం స్థానిక మ‌థుర జిన్నింగ్ ఆవ‌ర‌ణలో దేవతామూర్తుల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం పూల‌తో అందంగా అలంక‌రించిన‌ రథంలో జగన్నాథ్, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఉంచి శోభాయాత్ర‌ చేపట్టారు. ఈ వేడుకల్లో శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని జగన్నాధునికి ప్రత్యేక పూజలు చేశారు. జగన్నాధుని రథం వెళ్లే దారిని స్వయంగా ఎంపీ ఎమ్మెల్యేలు చీపిరి పట్టుకొని శుభ్రం చేశారు.

భక్తులతో కలిసి జగన్నాధుని ర‌థాన్ని తాడుతో లాగారు. పట్టణ పురవీధుల గుండా సాగిన రథోత్సవంలో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పూరీలో జరిగే జగన్నాధుని రథోత్సవం వేడుకల్లో పాల్గొనలేని భక్తుల కోసం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా పట్టణంలో జగన్నాధుని రథోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. వేడుకల్లో పాల్గొన్న భక్తులు, మహిళలు చేసిన నృత్యాలు, శ్రీకృష్ణుని నామస్మరణతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. రధం వెళ్లి దారి పొడవునా భక్తులు రోడ్డును శుభ్రం చేస్తు, ముగ్గులు వేస్తూ జగన్నాథ్ ని రథాన్ని తాడుతో లాగుతూ తమ భక్తి పారవర్షాన్ని చాటుకున్నారు.