19 March, 2026 | 3:27 AM

గుజరాత్‌కు చేరిన జగ్‌లాడ్కి

19-03-2026 12:18 AM

80,800 టన్నుల ముడిచమురును తీసుకొచ్చిన ఇంధన ట్యాంకర్

క్షేమంగా వచ్చిన భారత్ నావికులు

న్యూఢిల్లీ, మార్చి 18: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నడుమ భారత చమురు ట్యాంకర్ ‘జగ్ లాడ్కి’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా బుధవారం చేరుకుంది. ఈ నౌక యూఏఈ ఉత్పత్తి చేసే ముర్బన్ క్రూడ్ గ్రేడ్‌కు చెందిన సుమారు 80,800 టన్నుల ముడి చమురును భారత్‌కు తీసుకువచ్చింది. ఈ ట్యాంకర్‌తో పాటు అందులోని భారతీయ నావికులందరూ గుజరాత్ పోర్టుకు క్షేమంగా చేరుకున్నారు.

గల్ఫ్ దేశమైన యూఏఈలోని ఫుజైరా పోర్టుపై దాడి జరిగి, అక్కడి కొన్ని చమురు కార్యకలాపాలు కొద్దిసేపు నిలిచిపోయిన ఒక రోజు తర్వాత, ఈ ముడి చమురు ట్యాంకర్ ఆదివారం యూఏఈ నుంచి సురక్షితంగా బయలుదేరి, బుధవారం గుజరాత్‌కు చేరింది. అంతకుముందు సోమవారం, ఎల్పిజీ ట్యాం కర్ ‘శివాలిక్’, మంగళవారం, సుమారు 46,000 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ట్యాంకర్ ‘నందా దేవి’ గుజరాత్‌కు చేరిన విషయం తెలిసిందే.