05-05-2025 08:02:49 PM
మందమర్రి (విజయక్రాంతి): అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, మాచవరం సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో నిర్వహించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు ఆద్యంతం వీక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ ఆఫ్ వార్త) దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆధ్యాత్మిక గురువు దైవాజ్ఞ శర్మ, నవల రచయిత సురపల్లి విజయ, న్యూరాలజిస్ట్ డాక్టర్ ముదిగొండ గోపికృష్ణ, విప్రో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాస్, అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథంలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. అనంతరం వివిధ రంగాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు చెందిన వారిని వివిధ పురస్కారాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ వేడుకల్లో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ అఫ్ వార్త) కు జాతీయ అవార్డు-2025ను అందజేసి, ఘనంగా సన్మానించారు. క్రాంతి కుమార్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగతం అయ్యేలా, నిజాలను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ అవార్డుతో జిల్లా జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అభినృత్య కూచిపూడి కళాశాలకు చెందిన శేర్లి మరియా ఫరాక్, త్రిపుర నృత్య భారతి క్లాసికల్ డాన్స్ అకాడమీ కైరిక నందిని, స్వరవాహిని శిక్షణాలయం చక్రావధామల ప్రసన్నలక్ష్మి, జై భీమ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉమాదేవి, కన్వీనర్ ఇనుముల రాజేశ్వర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది మంజుల మదరం, సోషల్ లిస్ట్ మంజుల పూజారి, సోషల్ వర్కర్ కందన్ జోషి, సినిమా ఆర్టిస్ట్ దోర్నాల హరిబాబు, తెలంగాణ సంస్కృతి సాహిత్య సేవా ట్రస్ట్ సభ్యులు మాచవరం నరసింహ సాయి శ్రీనివాస్, అద్దంకి నాగేశ్వరరావు మాచవరం సేవ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మాచవరం గౌరీశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బట్టు శ్రీనివాస్ రావు లు పాల్గొన్నారు.