ఫోన్ట్యాపింగ్ కేసులో బెయిల్స్పై తీర్పు రిజర్వు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి) : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు బెయిల్ పిటిషన్లపై బుధవారం నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వు చేసింది. అయితే తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసులో అరెస్టయిన 90రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ, డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీట్ వేశామని, వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతోనే తిరిగి మళ్లీ వేసినట్టు పోలీసుల తరపు వాదనలు కోర్టుకు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.






