కమల నరకానికే వెళ్తది
- సైనికుల మరణాన్నీ పట్టించుకోలేదు
- రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ శాపనార్ధాలు
వాషింగ్టన్, ఆగస్టు 29: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష రిపబ్లికన్, అధికారి డెమోక్రాట్ల మధ్య మాటల యుద్ధం శృతి మించుతున్నది. డెమోక్రాట్ల అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్పై రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె నరకానికే వెళ్తుందని శాపనార్ధాలు పెట్టారు. ఇరాక్, ఆఫ్గనిస్థాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికులను ఖననం చేసిన అర్లింగ్టన్లోని జాతీయ స్మశానవాటికకు ఇటీవల రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెళ్లి నివాళులు అర్పించారు. ఆ సమయంలో రిపబ్లికన్ల ప్రచార ఫొటోగ్రాఫర్ను లోపలికి అనుమతివ్వటం వివాదానికి దారితీసింది.
ఆ ఘటనపై వాన్స్ను మీడియా ప్రశ్నించగా.. అదేమంత పెద్ద విషయం కాదని, మీడియా కావాలనే రచ్చ చేసిందని ఆరోపించారు. అదే సమయంలో ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో అల్ఖాయిదా బాంబు దాడిలో 13 మంది అమెరికా సైనికులు మరణించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో కమలాహ్యారిస్ తన విధులు సక్రమంగా నిర్వహించకపోవటం వల్లనే ఎంతో ధైర్యవంతులైన సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. సైనికుల మృతికి కారణమైన కమలా హారిస్ నరకానికి వెళ్తుందని శాపనార్ధాలు పెట్టారు.




