11-06-2025 12:00:00 AM
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. పర్యాటకులను ఆకర్షించేందుకు విజిట్ మాల్దీవ్స్ పేరుతో ప్రత్యేక వేసవి విక్రయ ప్రచారాన్ని తాజాగా ప్రారంభించింది. ఇందులోభాగంగానే కత్రినా కైఫ్ను రాయబారిగా ఎంపిక చేసినట్టు తెలిపింది.
ఈ నియామకంపై కత్రినా ఆనందం వ్యక్తం చేశారు. మాల్దీవుల అందానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. “మాల్దీవులు సహజ సౌందర్యాన్ని సూచిస్తారు. ప్రశాంతంగా ఉండే ప్రదేశం. పర్యాటకులను పెంచేందుకు నావంతు కృషి చేస్తాను. దీనికి అంబాసిడర్గా నియమించడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు. నిరుడు భారత్తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు పర్యాటకం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మాల్దీవుల పర్యాటకుల విషయంలో 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్.. 2024 నాటికి ఆరో స్థానానికి చేరింది. దీంతో భారతీయులను ఆకర్షించేందుకు ఆ దేశం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కత్రినాను రాయబారిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆ దేశాన్ని సందర్శించనున్నారు.