20-06-2025 12:20:30 AM
యాదాద్రి భువనగిరి, జూన్ 19 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని ఆగం చేశాడని, నేటి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
గురువారం వాసాలమర్రి గ్రామంలో అర్హులైన 205 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డిలతో కలిసి మంత్రి పొంగులేటి మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.
నాడు గ్రామస్థులతో కేసీఆర్ సహపంక్తి భోజనం చేసి, ఆగవ్వ అనే అనే వృద్ధురాలిని పక్కన కూర్చోబెట్టుకొని ఇల్లు కట్టిస్తానని మర్చిపోయిండనన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆగవ్వ మాటల్లోనే వింటుంటే బాధ కలిగిందన్నారు. ఆగవ్వ చెప్పినట్లు కేసీఆర్ చేసిన పచ్చిమోసం బట్టబయలు అయిందని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి ఆగవ్వతో పాటు వాసాలమర్రి గ్రామస్థులందరూ ఆగమయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాసాలమర్రి గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని చెప్పారు. వాసాలమర్రి లాగానే ఇల్లు ఇస్తామంటూ బొమ్మను చూపి ఓట్లు వేయించుకున్న కేసీఆర్ ఏ ఒక్క ఊరికి ఇల్లు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలో ముంచితే తమ ప్రభుత్వం మిత్తి రూ.6,500 కోట్లు ప్రతినెల చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి ఇంటి గుమ్మానికి చేరుస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి డబ్బులు లేవని ఆగవ్వ చెప్పడంతో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రూ.లక్ష సాయం ప్రకటించారు. తక్షణమే ముగ్గు పోసి పనులు చేపట్టాలని మంత్రి సూచించి, ఎమ్మెల్యేను అభినం దించారు. పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఆశయంతో అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ధరణి ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారం కానందున, ప్రభుత్వం ప్రతి రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనలతో కొత్త చట్టం భూభారతి 2025 తెచ్చిందని వెల్లడించారు. పేదవారికి ఏ ఆపద వచ్చినా తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి, ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం పైలెట్ ప్రాజెక్టు ఎంపిక చేసిన భువనగిరి మండలంలోని బండసోమారం గ్రామంలో పూర్తి కావస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి, పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కల నెరవేర్చాలని ఆకాంక్షతో ప్రభు త్వం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిందన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. వాసాలమర్రి గ్రామంలో అర్హులైన పేదవారికి ఇండ్ల పత్రాలు పంపిణీ చేయడం ప్రజా పాలనకు ఒక నిదర్శనం అని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చెర్మన్ బండు శోభారాణి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు చైతన్య మహేందర్రెడ్డి, రేఖబాబురావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.