24-02-2026 12:22:46 AM
ఏప్రిల్ 30 నాటికి నల్గొండ ఎక్స్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జి పూర్తి కావాలి: జీహెచ్ఎంసీ సీఈ సహదేవ్ రత్నాకర్
హైదరాబాద్ ,సిటీ బ్యూరో ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు చేపట్టిన కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ సీఈ సహదేవ్ రత్నాకర్ అధికారులను ఆదేశించారు. బల్ది యా కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం ఆయన మూసారంబాగ్, నల్గొండ ఎక్స్ రోడ్స్, జూపార్క్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నల్గొండ ఎక్స్ రోడ్స్ వద్ద ఓవైసీ ఫ్లైఓవర్ మార్గంలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను సీఈ పరిశీలించారు.
ఈ వారం లోపల నాలుగు స్లాబ్ భాగాల పనులను పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ర్యాంప్ పనులను మరింత వేగవంతం చేసి, ప్రధాన స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. మూసారంబాగ్ వంతెన నిర్మాణ పనుల పురోగతిని సీఈ సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియను పెండింగ్లో ఉన్న పరిహారం చెక్కుల జారీని తక్షణమే పూర్తి చేసి ఆస్తుల అప్పగింతను వేగవంతం చేయాలన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఎస్ఈ, ఈఈ, డిప్యూటీ ఈఈలతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.