calender_icon.png 18 June, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమేనీ అంతమే.. అయితే ఇప్పుడే కాదు

18-06-2025 01:00:51 AM

  1. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో తెలుసు: ట్రంప్
  2. టెహ్రాన్‌ను వెంటనే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక
  3. జీ-7 సదస్సు నుంచి హుటాహుటిన స్వదేశానికి
  4. కాల్పుల విరమణ కాదు.. నిజమైన ముగింపు కావాలన్న ట్రంప్
  5. టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్  దాడి.. ఎఫ్-14 ఫైటర్ జెట్లు ధ్వంసం
  6. మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ బాంబుల వర్షం

1. ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయం

2. టెహ్రాన్‌ను వీడాలని ట్రంప్ హెచ్చరికతో నగరంలో బారులుతీరిన వాహనాలు

3. జీ-౭ సదస్సు నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణమైన అమెరికా అధ్యక్షుడు

టెహ్రాన్/ టెల్ అవీవ్, జూన్ 17: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంతమవ్వడం ఖాయమని, అయితే అది ఇప్పుడే కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారన్న పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం చాలా తేలిక అయినప్పటికీ.. ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదన్నారు.

ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో రాజధాని టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు అనవసరంగా యుద్ధంలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

యుద్ధం పతాకస్థాయికి చేరడంతో వెంటనే ప్రజలు టెహ్రాన్‌ను వీడితే మంచిదని తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాను కోరుకోవడం లేదని.. యుద్ధానికి నిజమైన ముగింపు (రియల్ ఎండ్) ఉండాలన్నారు. యుద్ధం నేపథ్యంలో కనాన్‌స్కిస్ వేదికగా జరుగుతున్న జీ-7 శిగరాగ్ర సదస్సు నుంచి ట్రంప్ హుటాహుటిన అమెరికాకు చేరుకోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొన్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ.. అమెరికా అధ్యక్షుడు ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్‌లో ఏదో జరగబోతుందనే సంకేతాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణ కోసమే ట్రంప్ అర్థంతరంగా అమెరికా వెళ్లిపోయారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు కొట్టివేశారు.

తన వ్యాఖ్యలను మక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను వాషింగ్టన్‌కు వెళ్లింది కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదని.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతుందని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్టీవ్ విట్‌కాఫ్‌ను లేదా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను చర్చలకు పంపే యోచనలో ఉన్నట్టు  ట్రంప్ తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయ డం లేదంటూ నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ తుల్సి గబ్బార్డ్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అణ్వాయుధ తయారీకి ఇరాన్ అతి చేరువలో ఉందన్నారు.

మరింత ముదిరిన యుద్ధం..

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఐదోరోజు మరింత ముదిరింది. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాలు మరోసారి భీకర దాడులు చేసుకున్నాయి. మంగళవారం టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలటరీ అధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు అలీ షాద్మానీ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) వెల్లడించింది.

సెంట్రల్ టెహ్రాన్‌లోని ఒక ప్రదేశంలో అలీ షాద్మానీ తలదాచుకున్నట్టు వచ్చిన కచ్చితమైన సమాచారంతో దాడులు జరిపామని తెలిపింది. టెహ్రాన్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అక్కడున్న రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు దాడుల్లో పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ లోని బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో అక్కడి బ్యాంకులపై సైబర్ దాడులు జరుగుతున్నా యి. దీంతో వినియోగదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై తమ దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలను దెబ్బ తీస్తూ వస్తున్న ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోస్సాద్ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది.

ఇరాన్‌లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి నుం చి కీలక అధికారులు, అణు శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారమివ్వడం వెనుక మొస్సాద్ కేంద్ర కార్యాలయం హస్తం ఉంది. ఇరాన్‌కు పెద్ద మొత్తంలో డ్రోన్లను తరలించి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుక ఈ సంస్థే కీలకం.దీంతోపాటు గ్లిలాట్‌లోని ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైనా క్షిపణి ప్రయోగించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది.

ఇప్పటివరకు పరస్పర దాడుల్లో ఇరాన్‌లో 224 మంది మృతి చెందగా.. ఇజ్రాయెల్‌లో 24 మంది మరణించినట్టు తెలుస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలతో భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ భారత ఎంబసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయులు వెంటనే తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడాలని, దౌత్య అధికారులను సంప్రదించాలని తెలిపింది. తాజాగా భారత్‌కు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు ఇరాన్ నుంచి ఆర్మేనియాకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారత్‌కు తరలిరానున్నారు.

ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగుస్తుంది

ఇరాన్ సుప్రీం లీడర్ అమతొల్లా ఖమేనీని హతమారిస్తేనే రెండు దేశాల మధ్య యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్ యుద్ధంపై కీలక విషయాల గురించి ప్రస్తావించారు. ఇరాన్‌పై చేస్తున్న దాడులను సమర్థించారు. ఇరు దేశాల మధ్య సంఘర్షణ పెంచేకంటే త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యూహాన్ని తిరస్కరించారని కథనాలు వచ్చిన మరుసటి రోజే నెతన్యాహు వాఖ్యలు చేయడం ఆసక్తి సంతరించుకుంది.  మరోవైపు భీకర దాడుల నేపథ్యంలో అయతొల్లా ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులను ఇరాన్ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ బంకర్‌కు తరలించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అంతకంటే పెద్దదే జరగబోతోంది: ట్రంప్

ఈ సందర్భంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసమే ట్రంప్ జీ-7 సదస్సు నుంచి అర్థంతరంగా స్వదేశానికి వెళ్లారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు. ‘కేవలం పబ్లిసిటీ కోసమే మక్రాన్ పాకులాడుతున్నారు.

నేను జీ-7 సదస్సు నుంచి ఎందుకు వీడుతున్నానో ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేను వాష్టింగ్టటన్‌కు ఎందుకు వెళ్తున్నానో ఆయనకు సరిగ్గా తెలియదు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదు.. అంతకంటే పెద్దదే జరగబోతోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.