12-01-2026 12:15:17 AM
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
54వ డివిజన్ లో ఎన్టీఆర్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
ఖమ్మం టౌన్, జనవరి 11(విజయక్రాంతి): రాష్ట్రంలో నివాస యోగ్య నగరంగా ఖమ్మం ముందు వరుసలో ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి, ఆదివారం ఖమ్మం నగరం 54వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన పార్క్ ను మంచిగా నిర్వహణ చేస్తూ, ఇంకనూ కావాల్సిన సిసి కెమెరాలు, గ్రాస్ కార్పెట్ తదితరాలను సమకూర్చుకోని అభివృద్ధి పర్చుకోవాలన్నారు. రోడ్లను ఆక్రమించుకోవద్దని, పేదలకు గృహ వసతి కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రోడ్ల విస్తరణకు సహకరించాలని అన్నారు. నీటి ప్రవాహానికి అడ్డంకులు పెట్టడంతో సమస్యలు వస్తున్నాయని, అధికారుల ప్లాన్ ప్రకారం సహకరించాలని అన్నారు. ఇబ్బందులు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చిన విస్తరణతో అభివృద్ధి తో పాటు వ్యాపారాలు మంచిగా జరుగుతాయని అన్నారు. కొంతమందికి ఇబ్బంది కల్గిన, ఎంతో మందికి లబ్ది చేకూరుతుందని అన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణ లో ఖమ్మం నగరం ఒక్కటే నివాసయోగ్య నగరంగా మారిందని, శాంతి భద్రతలు, పచ్చదనం, పరిశుభ్రత పాటిస్తే అంత అభివృద్ధి సాధ్యమని అన్నారు. జాతీయ రహదారులు ఖమ్మం మీదుగా వెళుతున్నాయని, రాబోయే కొద్దీ రోజుల్లో రాజమండ్రికి గంటన్నర, హైదరాబాద్ కు రెండున్నర గంటల్లో వెళ్లొచ్చని అన్నారు.
ప్రజలకు ఉపయోగకరమైన పనులు నగరంలో చేపడుతున్నామని, ఈ పనులను స్థానిక నాయకులు, అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి నాణ్యతతో, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మంత్రి అన్నారు. ఖమ్మం నగర జనాభా 5 లక్షలకు చేరిందని, రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా త్రాగునీటి సరఫరా, నూతన డ్రెయిన్ లు, రోడ్డు సౌకర్యం, పేదలకు ఇండ్లు వంటి అనేక కార్యక్రమాలను చేయాలని, దీనికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భోగి మంటలు, భోగి పండ్లతో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంత రావు, స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, కార్పొరేటర్లు, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, డిఇ ధరణి కుమార్,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.