31 August, 2026 | 11:45 AM

జోగులాంబ అమ్మవారి సన్నిధిలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

31-08-2026 10:37 AM

పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు

కేంద్ర మంత్రితో కలిసి పాల్గొన్న ఎంపీ డీకే అరుణ

అలంపూర్, ఆగస్టు 31: కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి సోమవారం ఉదయం అలంపూర్‌ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణతో కలిసి ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.అనంతరం కిషన్‌రెడ్డి ముందుగా శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ సన్నిధికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా వేద అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. దేశంలోని ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమని మంత్రి తెలిపారు.కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతుగంటి భరత్‌, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.