5 August, 2026 | 10:10 PM

నీ చెల్లి కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే

05-08-2026 09:39 PM

కేటీఆర్‌పై కేకే మహేందర్ రెడ్డి విమర్శలు : ఎగువ మానేరు వద్ద పూజలు

గంభీరావుపేట, ఆగస్టు 5 (విజయ క్రాంతి): సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి బుధవారం ఎగువ మానేరు జలాశయాన్ని సందర్శించి నీటి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ..తొమ్మిదవ ప్యాకేజ్ పనులు పూర్తి చేయకపోవడంతో పది వేల ఎకరాల సాగు హక్కు దెబ్బతిందని, గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ నిర్లక్ష్యం వహించారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. “ధైర్యం ఉంటే మీ చెల్లి కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి” అంటూ కేటీఆర్‌ను సవాల్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షాన నిలుస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వరుణ యాగాల అనంతరం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, ప్రకృతి కూడా ప్రజా పరిపాలనకు అనుకూలంగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్యాకేజీలు పూర్తి చేయక ప్రాంతాన్ని ఎండబెట్టారని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ కాలంలో నిర్మితమైందని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఎగువ మానేరు నిండుకుండలా మారడం సంతోషకరమని, వచ్చిన ప్రతి నీటిని నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ-తిరుపతి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు, మాజీ మండల అధ్యక్షుడు హామీద్, మల్లారెడ్డిపేట సర్పంచ్ మహేష్ యాదవ్, ఒరగంటి నర్సింలు, ఎలుక రాజు,నుశ్రాతుళ్ళ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.