గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు
డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): కొత్తగూడెం త్రీ టౌన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి, వారిని గౌరవనీయ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మత్తు పదార్థాల వినియోగం నుంచి వారిని బయటకు తీసుకువచ్చి, సాధారణ జీవన విధానంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవనీయ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వారిని డీ-అడిక్షన్ సెంటర్కు తరలించినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ, యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని, వారి ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా గంజాయి , ఇతర మత్తు పదార్థాల విక్రయం, సరఫరా, రవాణా, వినియోగానికి పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మత్తు పదార్థాలకు బానిసైన వారిని కేవలం శిక్షించడం మాత్రమే కాకుండా, అవసరమైన సందర్భాల్లో చికిత్స, పునరావాసం అందించడం ద్వారా వారిని తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయం, సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.






